దేవుని యొక్క ఉనికి నిరూపించనులేము లేదా ఒప్పక ఉండనూలేము. పరిశుద్ధ గ్రంధము చెప్తుంది దేవుడు ఉన్నాడని విశ్వాసముతో మనము నమ్మాలని: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” (హెబ్రీ. 11:6). దేవుడు అలా గనుక అనుకుని ఉంటే, ఆయన ఉన్నాడని అందరికి ప్రత్యక్షమై ప్రపంచమంతటికి నిరూపించేవాడు. కాని ఆయన అది చేసియుంటే, విశ్వాసము యొక్క అవసరత ఉండేది కాదు. “యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను” (యోహాను 20:29).

అయినప్పటికీ, దీనికి అర్ధం దేవుని ఉనికికి ఆధారం లేదు అని కాదు. పరిశుద్ధ గ్రంధం చెప్తుంది, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవి” (కీర్తన. 19:1-4). నక్షత్రములను చూచినప్పుడు, విశ్వము యొక్క విస్తీర్ణతను అర్ధం చేసుకొనినప్పుడు, ప్రకృతి యొక్క వింతలను పరిశీలించినప్పుడు, సూర్యాస్తమయము యొక్క అందమును చూచినప్పుడు– ఇవన్నియు సృష్టికర్తయైన దేవుని వైపు మనలను చూపిస్తున్నవి. ఇవన్నియు చాలవన్నట్లు మన హృదయములలో కూడా దేవుని గురించి ఒక ఆధారం ఉంది. ప్రసంగి 3:11 చెప్తుంది, “…ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు.” మన అంతరంగములో మనకు ఈ జీవితము తరువాత మరియు ఈ ప్రపంచము తరువాత ఏదో ఉన్నదన్న ఒక గ్రహింపు ఉంది. తెలివిగా ఈ జ్ఞానాన్ని తిరస్కరించవచ్చును గాని, మనలో మరియు మన చుట్టూ ఉన్న దేవుని ప్రసన్నత స్పష్టంగానే ఇంకను ఉంది. అయినా కూడా, కొందరు దేవుని ఉనికిని విస్మరిస్తారని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది: “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు” (కీర్తన. 14:1). చరిత్ర అంతటిలో, అన్ని సంస్కృతులలో, అన్ని నాగరికతలలో, మరియు అన్ని ఖండాలలో అధిక సంఖ్యక ప్రజలు ఎదో ఒక రకమైన దేవుని యొక్క ఉనికిని నమ్ముతారు గనుక, ఈ నమ్మకమును కలిగించే ఒకటి (లేదా ఒకరు) ఉండే ఉంటారు.

దేవుని ఉనికికి గల పరిశుద్ధ గ్రంధ వాదనలతో పాటు కొన్ని హేతుబద్ధ వాదనలు కూడా ఉన్నాయి. మొదటిగా మనకు అస్తిత్వ వాదన ఉంది. ఈ అస్తిత్వ వాదనలో ప్రసిద్ధమైన రూపము దేవుడు అనే భావనను దేవుని ఉనికిని ఋజువు చేయడానికి వాడుతుంది. అది దేవుని “తన కంటే ఉన్నతమైనవారు ఎవరిని ఊహించలేము” అని నిర్వచిస్తూ మొదలౌతుంది. ఆ తరువాత అది ఉనికి లేకుండా ఉండటం కంటే ఉనికి కలిగి ఉండటం గొప్పదని వాదిస్తుంది, మరియు ఈ కారణాన ఊహించగలిగే గొప్ప వ్యక్తి తప్పక ఉండాలి. దేవుడు ఒకవేళ లేకపోతే, అప్పుడు దేవుడు ఊహించగలిగే గొప్ప వ్యక్తి కాదు, కాబట్టి ఇది అసలు దేవునికున్న ముఖ్య నిర్వచనాన్ని వైరుధ్యపరుస్తుంది.

రెండవ వాదన ఉద్దేశ్యతత్వ వాదన (దీనినే టీలియాలజీ అంటారు). ఈ ఉద్దేశ్యతత్వ వాదన చెప్తుంది ఈ విశ్వం అనేకమైన ఆశ్చర్యకర రూపకల్పనలు కలిగియున్నందున వీటిని చేసిన ఒక దైవికమైన కల్పనాకారుడు ఉండాలి. ఉదాహరణకు, ఒకవేళ భూమి గాని సూర్యుని నుండి ఇంకా దగ్గరగానో లేక ఇంకొంత దూరంగానో ఉంటే, అది ప్రస్తుతం చేస్తున్నట్లుగా జీవకోటిని పోషించగలిగేది కాదు. మన వాతావరణంలో ఉన్న కొన్ని మూలికలు ఎంతోకొంత తక్కువ శాతంలో ఉండి ఉంటే, దరిదాపుగా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటి మరణిస్తుంది. ఒక పోషకపదార్ధ అనువు దానంతట అది ఏర్పడుటకు గల అవకాశం10243 లో (అంటే 10 తరువాత 243 సున్నాలు) కేవలం 1 మాత్రమే ఉంటుంది.

దేవుని ఉనికికి గల మూడవ హేతుబద్ధ వాదన విశ్వోద్భవ వాదన. ప్రతి ప్రభావానికి తప్పక ఒక హేతువు ఉండక తప్పదు. ఈ విశ్వము మరియు దానిలో ఉన్న సమస్తము ఒక ప్రభావం. సమస్తమును ఉనికిలోకి తెచ్చినది ఒకటి తప్పక ఉంటుంది. ఆఖరుకు ప్రతి దానిని మనుగడలోనికి తెచ్చిన హేతువు ఉన్నదంటే తప్పకుండా “అహేతువు” అయినది ఒకటి ఉండాలి. ఆ “అహేతువైన” హేతువే దేవుడు.

నాల్గవ వాదనను నైతిక వాదన అంటారు. చరిత్ర అంతటిలో ప్రతి సంస్కృతి ఒక విధమైన చట్టమును కలిగియుంది. ప్రతి ఒక్కరికి తప్పేదో ఒప్పేదో అనే జ్ఞానం ఉంది. నరహత్య, అబద్ధం, దొంగతనం మరియు అనైతికత అన్ని విశ్వవ్యాప్తంగా తిరస్కరించబడినవి. పరిశుద్ధుడైన దేవుని నుండి గాక తప్పు ఒప్పులను గూర్చిన ఈ తెలివి ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది?

ఇవన్నీ ఉన్నప్పటికీ, పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది స్పష్టమైన మరియు విస్మరించరాని దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి ఒక అబద్ధాన్ని నమ్ముతారని. రోమా 1:25లో, “అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌” అని చదువుతాం. దేవుని నమ్మకయుండిన యెడల ప్రజలు నిరుత్తరులై యున్నారు అని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది: “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా. 1:20).

దేవుని ఉనికిని ప్రజలు తిరస్కరిస్తామని అంటుంటారు, ఎందుకంటే అది ఒక “శాస్త్రీయమైనది” కాదు లేదా “ఎందుకంటే దానికి ఆధారము ఏమియు లేదు” అని అంటారు. అసలైన కారణము ఏమంటే ఒకసారి వారు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నట్లయితే, వారు దేవుని పట్ల బాధ్యులుగా ఉన్నారని మరియు ఆయన నుండి క్షమాపణ కోరవలసినవారిగా ఉన్నారని వారు గ్రహించాలి గనుక ఒప్పుకోరు (రోమా. 3:23, 6:23). దేవుడు ఉన్నట్లయితే, మన క్రియలను బట్టి మనము ఆయనకు జవాబుదారులము. దేవుడు లేకపోతే, దేవుడు మనకు తీర్పు తీరుస్తాడనే భయం లేకుండా మనకు ఇష్టమోచ్చినది చేయవచ్చు. ఈ కారణము చేతననే దేవుని ఉనికిని తిరస్కరించే చాలా మంది సహజసిద్ధ సృష్టి అనే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని వ్రేలాడుతుంటారు – ఈ సిద్ధాంతం వారికి సృష్టికర్తయైన దేవుని నమ్ముటకు ఒక ప్రత్యమ్నాయ మార్గాన్ని ఇస్తుంది. దేవుడు ఉన్నాడు మరియు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆయన ఉన్నాడని తెలుసు. కొందరు ఆయన లేడని నిరూపించడానికి దూకుడుతో ప్రయత్నిస్తారు అనే విషయమే ఆయన ఉన్నాడు అనడానికి ఋజువుగా ఉంది.

దేవుడు ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? క్రైస్తవులముగా, మనము ప్రతి దినము ఆయనతో మాట్లాడతాము గనుక ఆయన ఉన్నాడని మనము ఎరుగుతాము. ఆయన మనతో మాట్లాడడం వినదగేట్లు ఉండదు, కాని ఆయన ప్రసన్నతను స్పృశిస్తాం, ఆయన నడిపింపును అనుభవిస్తాం, ఆయన ప్రేమను తెలుసుకుంటాం, ఆయన కృప కొరకు కనిపెడతాం. దేవుడు తప్ప వేరే ఎవ్వరు మనకు వివరించలేని కొన్ని సంగతులు మన జీవితములలో జరిగాయి. దేవుడు ఎంతో అద్భుతరీతిగా మనలను రక్షించి మన జీవితాలను మార్చాడు కనుక ఆయన ఉనికిని గుర్తించి ఆయనను స్తుతించకుండా ఉండలేము. ముందు నుండే స్పష్టంగా కనిపించే దానిని విస్మరించే వారిని పైన తెలుపబడిన వాదనలు ఏవీ కూడా ఒప్పించలేవు. ఆఖరుగా, దేవుని ఉనికి విశ్వాసముతో అంగీకరించబడాలి (హెబ్రీ. 11:6). దేవునిపై విశ్వాసం అంటే చీకటిలోనికి మనం వేసే గ్రుడ్డి అడుగు కాదు; బాగా వెలిగించబడిన గదిలోనికి వేసే సురక్షితమైన అడుగు, అక్కడ అధిక సంఖ్యాకులు ఇప్పటికే నిలిచియున్నారు.